Bandi Sanjay To KTR: కేటీఆర్ రూ. 100 కోట్ల లీగల్ నోటీసులపై బండి సంజయ్ కౌంటర్ ఎటాక్

Bandi Sanjay Reaction on KTR Notices: కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 04:20 AM IST
Bandi Sanjay To KTR: కేటీఆర్ రూ. 100 కోట్ల లీగల్ నోటీసులపై బండి సంజయ్ కౌంటర్ ఎటాక్

Bandi Sanjay Reaction on KTR Notices: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ గట్టిగా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వారి ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఆ ఇద్దరికీ నోటీసులు జారీచేసినట్టు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే, మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 

బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడి పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నాకు లీగల్ నోటీస్ జారీ చేసినట్లు వచ్చిన వార్తలను పత్రికల్లో చూశాను అని అందులో పేర్కొన్నారు. ఉడుత బెదిరింపులకి బెదిరిపోయేది లేదు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతాం. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా కేసీఆర్ కొడుకును ఒకటే అడగదల్చుకున్నా.... తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుండి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి.  పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు. కేసీఆర్ కొడుకు ఒక స్వయం ప్రకటిత మేధావి. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఝాని. మీ పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గుడు అంటూ బండి సంజయ్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

ప్రధాన మంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనం. ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్ కి ఎలా లీక్ అవుతున్నాయి. మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేసీఆర్ కొడుకు పదుల సంఖ్యలో నిందితుల అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? ఇద్దరు మాత్రమే దోషులంటూ సర్టిఫికెట్ ఇస్తూ కేసును నీరుగార్చేందుకు యత్నించిన కేసీఆర్ కొడుకుపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నందుకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న మాపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్ బెదిరింపులకు బెదిరేది లేదు.

నేను మళ్లీ చెబుతున్నా..... జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుండి నేటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ వరకు ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలి. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుండి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు బిజెపి పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ కొడుకును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అని బండి సంజయ్ స్పష్టంచేశారు.

Trending News