భారత్ చేరుకోనున్న కృష్ణచైతన్య మృతదేహం!

అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వెంకన్నగారి కృష్ణ చైతన్య

Last Updated : Feb 1, 2018, 11:46 PM IST
భారత్ చేరుకోనున్న కృష్ణచైతన్య మృతదేహం!

జనవరి 26న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వెంకన్నగారి కృష్ణ చైతన్య (30) మృతదేహం గురువారం రాత్రి భారత్‌కి చేరనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టుగా హ్యూస్టన్‌లో వున్న ఇండియన్ కాన్సులేట్‌ జనరల్‌కి సీనియర్ అధికారి ఒకరు వివరాలు వెల్లడించారు. మూడేళ్ల క్రితం తెలంగాణలోని సిద్ధిపేట నుంచి అమెరికా వెళ్లిన వెంకన్నగారి కృష్ణ చైతన్య గత శుక్రవారం డల్లాస్‌లో తాను వుంటున్న పేయింగ్ గెస్ట్ హౌజ్‌లో శవమై కనిపించారు. 

ఓ మల్టీనేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ పనికోసం అమెరికా వెళ్లిన వెంకన్నగారి కృష్ణ చైతన్య డల్లాస్‌లోని ఆర్లింగ్టన్‌లో పేయింగ్ గెస్ట్‌గా వుండేవారు. జనవరి 26న కృష్ణ చైతన్య తన గదిలోంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ పేయింగ్ గెస్ట్ హౌజ్ యజమాని పోలీసులకి సమాచారం అందించాడు. కృష్ణ చైతన్య వుంటున్న గది తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ అతడు బెడ్‌పై శవమై కనిపించాడు.

డల్లాస్ నుంచి ఈ దుర్వార్త అందుకున్న కృష్ణ చైతన్య తల్లిదండ్రులు సహాయం కోసం స్థానిక ఎంఎల్ఏ టి హరీష్ రావుని ఆశ్రయించారు. మృతుడి తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకున్న హరీష్ రావు.. వెంటనే మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ హ్యూస్టన్‌లో వున్న ఇండియన్ కాన్సూల్ జనరల్ అధికారులకి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకి విడివిడిగా లేఖలు రాశారు. కృష్ణ చైతన్య తండ్రి శ్రీనివాసులు బ్యాంకులో సీనియర్ అధికారి. ఉపాధి కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన కృష్ణ చైతన్య ఇలా శవమై తిరిగిరానుండటం శ్రీనివాసులు దంపతులని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. కృష్ణచైతన్యకు బ్రెయిన్ ట్యూమర్ వున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాధే అతడి మృతికి కారణమైందా లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు వున్నాయా అనే కోణంలో అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Trending News