2జీ కుంభకోణం కేసులో.. అందరూ నిర్దోషులే

సంచలనాత్మక 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో దోషులుగా ఉన్న అందరినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

Last Updated : Dec 21, 2017, 02:21 PM IST
2జీ కుంభకోణం కేసులో.. అందరూ నిర్దోషులే

సంచలనాత్మక 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో దోషులుగా ఉన్న అందరినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. సరైన ఆధారాలు లేకపోవడం వలనే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో ఇంకా చాలా కోణాలు ఉన్నాయని.. సీబీఐ ఆధారాలు లేకపోవడం వల్లే పై పేర్కొన్న వ్యక్తులను నిర్దోషులుగా తేల్చిందని.. తాము తదుపరి దర్యాప్తు చేసి హైకోర్టులో అప్పీలు చేస్తామని ఈ కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసు వర్గాలు తెలియజేశాయి.

కాంగ్రెస్ హయంలో దేశాన్ని మొత్తాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో దాదాపు 1.76లక్షల కోట్లు చేతులు మారినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై అప్పటి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అధికారులు స్పందిస్తూ.. పలువురు మంత్రులు కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారని
తెలపడంతో..  2010లో అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజాను పదవి నుండి ప్రభుత్వం తప్పించింది.

ఆ తర్వాత డీఎంకే ముఖ్యనేతలు కనిమొళి సహా 17 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రస్తుతం ఇదే కేసు విషయమై తీర్పు డీఎంకే పార్టీకి అనుకూలంగా రావడంతో పాటు, అందరినీ నిర్దోషులుగా తేల్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..2జీ కేసులో అసత్య ఆరోపణలు చేసిన కాగ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Trending News