ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే కొత్త ప్రయోగం

ప్రమాదాల నివారణ, ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ నూతన వ్యవస్థను అమలు చేయనుంది.

Last Updated : Mar 25, 2018, 08:10 PM IST
ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే కొత్త ప్రయోగం

ప్రమాదాల నివారణ, ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ నూతన వ్యవస్థను అమలు చేయనుంది. దీనికోసం కోచ్ డిఫెక్ట్ మానిటరింగ్ సిస్టంను 65 రైల్వే సెక్షన్‌లలో ఏర్పాటు చేయనుంది. ఇందులో 25 సెక్షన్లు మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే పరిధిలో (ప్రధానంగా మహారాష్ట్ర) ఉండనున్నాయి.  వార్ధా-నాగ్ పూర్, భుసావల్-జల్గోన్, ముంబై-సూరత్, సూరత్-బరోడా సెక్షన్లలో ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు భారతీయ రైల్వే అధికారులు.

ఈ పద్ధతిలో మైక్రో ఫోన్లు, సెన్సార్లను కోచ్‌ల మధ్య ఏర్పాటు చేయనుండగా ఇవి శబ్దాలను రికార్డు చేస్తాయని, వాటిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. ఈ 25 సెక్షన్లలో కోచ్ డిఫెక్ట్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేయటానికి 115 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు

ఈ వ్యవస్థ గురించి ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అరుణ్ అరోరా వివరించారు. ‘మైక్రో ఫోన్లు, సెన్సార్లను వ్యాగన్ల మధ్య ఏర్పాటు చేస్తారు. ఇవి శబ్దాలను రికార్డు చేస్తుంటాయి. రైలు వెళుతున్నప్పుడు ఒత్తిడిని కూడా నమోదు చేస్తాయి. అధికారులు ఆన్ లైన్ లో పర్యవేక్షిస్తుంటారు' అని తెలిపారు భారతీయ రైల్వే అధికారులు.

"ఆన్ లైన్ మానిటరింగ్ ఆఫ్ రోలింగ్ స్టాక్(ఓఎంఆర్ఎస్) పరికరాలు చాలా సున్నితమైనవి, ఖచ్చితమైనవి. రోలింగ్ స్టాక్ నుండి వచ్చే అసాధారణ శబ్దాలను అవి చాలా త్వరగా గుర్తించగలవు. అవి తక్షణమే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి" అని అరుణ్ అరోరా చెప్పారు.

ఢిల్లీ-పానిపట్ సెక్షన్లో అమలవుతున్న లక్నో-ఢిల్లీ మార్గంలో ఓఎంఆర్ఎస్ ప్రయోగం విజయవంతం అయ్యిందని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థతో వేగవంతమైన కోచ్ల నిర్వహణ, మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలను ఉపయోగించి కోచ్లను పర్యవేక్షించవచ్చు. దీనితో పాటు సెంటర్ బఫర్ కపులింగ్ పరికరాన్ని కూడా ఏర్పాటు చేయాలని రైల్వే నిర్ణయించింది.

 

Trending News