పందిపిల్లకి డబ్బింగ్ చెప్పిన నటకిరీటి రాజేంద్రప్రసాద్

‘అదుగో’.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. 

Last Updated : Oct 28, 2018, 01:36 PM IST
పందిపిల్లకి డబ్బింగ్ చెప్పిన నటకిరీటి రాజేంద్రప్రసాద్

‘అదుగో’.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు న‌ట‌కిరీటి రాజేంద్రప్రసాద్ కూడా అదుగో టీంతో జ‌త క‌లిసారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ డ‌బ్బింగ్  చెప్పడం విశేషం. దీపావళి సంద‌ర్భంగా ‘అదుగో’ను విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. పూర్తి ప్రయోగాత్మకంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీల‌క‌పాత్రలో న‌టిస్తోంది. ఈ పాత్రకే రాజేంద్రప్రసాద్ డ‌బ్బింగ్ చెప్పారు. ఈయ‌న వాయిస్ ఓవ‌ర్ అదుగో సినిమాకి ప్రత్యేక ఆక‌ర్షణగా నిల‌వ‌నుంది. థియేట‌ర్స్‌లో ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటుంది చిత్ర యూనిట్ .

ఇప్పటికే విడుద‌లైన అదుగో ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. బంటిగా పందిపిల్ల అంద‌రి మ‌న‌సుల‌ను దోచేసింది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా క‌నిపించడానికి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్ టెక్నాల‌జీని వాడుకున్నారు. ఓ సినిమా కోసం ఇలాంటి  టెక్నాల‌జీ వాడుకోవ‌డం ఇదే తొలిసారి. అభిషేక్ వ‌ర్మ‌, న‌భాన‌టాష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో న‌టిస్తుండ‌గా.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.  ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌లో ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ  నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

‘అల్లరి’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన జర్నీని మొదలు పెట్టిన రవిబాబు.. ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, అమరావతి, అనసూయ, అవును, మనసారా, సోగ్గాడు, నువ్విలా, లడ్డుబాబు.. లాంటి చిత్రాలతో  తనదైన మార్కు సొంతం చేసుకున్నారు. అలాగే దర్శకుడిగానే కాకుండా పలు చిత్రాలలో హాస్యనటుడిగా, సహాయ నటుడిగా కూడా రవిబాబు రాణించారు. నటుడు చలపతిరావు తనయుడైన రవిబాబు పలు తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. 

Trending News